ఉదయం బిజెపిలో..సాయంత్రానికి కాంగ్రెస్ లోకి

Update: 2018-10-11 16:09 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ భార్య పద్మినిరెడ్డి గురువారం ఉదయం బిజెపిలో చేరి పెద్ద కలకలం రేపారు. ప్రస్తుతం కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్న దామోదర్ రాజనర్సింహ భార్య ఇలా చేయటం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసింది.ఇదే అదనుగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయ దాడి ప్రారంభించింది. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతల భార్యలు కూడా నమ్మటం లేదంటూ సోషల్ మీడియా వేదికగా కూడా పొలిటికల్ ఎటాక్ ప్రారంభించారు.

మీడియాలో ఈ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. అయితే రాత్రికి రాత్రి సీన్ మారి పోయింది. గురువారం ఉదయం బిజెపిలో చేరిన పద్మిని రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బిజెపిలో చేరటం అనుకోకుండా జరిగిందని మీడియాకు తెలిపారు. దీంతో ఆమె తిరిగి సొంత గూటికి చేరినట్లు అయింది. పద్మినిరెడ్డి ప్రకటనతో కాంగ్రెస్ కాస్త ఊపిరిపీల్చుకున్నట్లు అయింది.

 

Similar News