గాలి ఫ్యామిలీకి టీడీపీ హ్యాండ్... నగరి సీటు శ్రీనివాసరాజుకే!

Update: 2018-05-05 06:11 GMT

తెలుగుదేశం పార్టీ గాలి ముద్దుకృష్ణమనాయుడి ఫ్యామిలీకి హ్యాండ్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఇచ్చిన ఎమ్మెల్సీ సీటుతోనే సరిపెట్టనుందా?. రాజకీయాల్లో ప్రవేశించేందుకు ఆసక్తిచూపుతున్న గాలి తనయులకు ఛాన్స్ లేదా?. అంటే అవుననే సమాధానం వస్తోంది టీడీపీ వర్గాల నుంచి. ఎందుకంటే దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం టీటీడీ జెఈవోగా ఉన్న శ్రీనివాసరాజుకు వచ్చే ఎన్నికల్లో నగరి సీటు ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్న సమాచారం. అందులో భాగంగానే ఆయనకు మరోసారి జెఈవో పోస్టు కొనసాగింపు ఇచ్చారని టాక్. శ్రీనివాసరాజు సిఫారసులతోపాటు...రాజకీయ కారణాలు చంద్రబాబు నిర్ణయానికి కారణం అయ్యాయని చెబుతున్నారు.

తిరుమలలో ఉంటే..అప్పుడప్పుడు నగరికి వెళ్ళి రాజకీయ వ్యవహారాలు చూసుకోవటానికి వీలు ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంశం. తనకు రాజకీయాల్లో ప్రవేశించే ఆసక్తి ఉందనే విషయాన్ని శ్రీనివాసరాజు పలుమార్లు ఛానల్స్ తో మాట్లాడిన సమయంలో వ్యక్తపరిచారు కూడా. నగరి బరి నుంచి శ్రీనివాసరాజు పోటీ ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అంటే ఆయన వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న మాట. మరి నగరి సీటును శ్రీనివాసరాజుకు ఇస్తే గాలి తనయులు మౌనంగా ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టీడీపీలో నగరి రాజకీయం హాట్ హాట్ గా మారే సూచనలు కన్పిస్తున్నాయి.

 

Similar News