నేను బలహీనపడితే ...రాష్ట్రం బలహీనం అవుతుంది

Update: 2018-03-18 13:33 GMT

‘నేను బలహీనపడితే రాష్ట్రం బలహీనపడుతుంది. రాష్ట్రం బలహీనపడితే ప్రజలు బలహీనం అవుతారు.’ ఇదీ ఉగాది సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ఎవరేమి చేసిన ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు సాగనివ్వబోనని ప్రకటించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న అన్ని హక్కులు రాష్ట్రానికి దక్కేంత వరకూ వదిలిపెట్టే ప్రశ్నేలేదన్నారు. ప్యాకేజీ తమకు ఏ మాత్రం సమ్మతం కాదని...రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదా ఇఛ్చి తీరాల్సిందేనన్నారు. ఉగాది పంచాంగ శ్రవణ సమయంలోనూ చంద్రబాబు రాజకీయ ప్రసంగమే చేశారు. అదేంటో మీరూ చూడండి. ‘‘దేశంలోనే సీనియర్‌ నాయకుడిని నేనే.

నా తరువాతే అందరూ ముఖ్యమంత్రులయ్యారు. అలాంటిది 29 సార్లు అడిగినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదా?’అని ప్రశ్నించారు. ‘‘నాలుగేళ్లు ఓపికగా తిరిగాను. 29 సార్లు అడిగాను. కానీ కేంద్రం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. చివరి బడ్జెట్‌ చూసిన తర్వాత ఇక భరించలేకపోయాను. అందుకే గళం విప్పాను. బీజేపీని నమ్ముకుంటే మోసం చేశారు. ఇప్పుడు వాళ్లే యుద్ధం చేస్తామంటున్నారు. రాష్ట్రంలో లేనిపోని సమస్యలు సృష్టించే దిశలో బీజేపీ ప్రవర్తిస్తోంది. నాలుగు సంవత్సరాలు మాతో స్నేహంగా ఉండి.. ఒక్కసారే విమర్శలు చేస్తున్నారు. తెలుగువారు ఆత్మగౌరవం చంపుకొని ఉండలేరని ప్రధానమంత్రి మోదీతో చెబితే.. ఆయన పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడారు. దేశ సైన్యానికి ఖర్చుచేసే డబ్బులు కూడా అడుగుతారా అని జెట్లీ ఎద్దేవా చేశారు..’’ అని తెలిపారు.

Similar News