లోకేష్..తాగి మాట్లాడావా?

Update: 2017-11-21 14:17 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ పై ప్రముఖ సినీ రచయిత..నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందుల గురించి విమర్శించే వారంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ ఆర్ఏ)లు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పోసాని మాటలు ఆయన వ్యాఖ్యల్లోనే...’ లోకేష్ బాబూ ఏమైనా చదువుకున్నావా నువ్వు. కొంచెమన్నా బుద్ధి..జ్ణానం ఉండి..సంస్కారంతో మాట్లాడుతున్నావా?.2014 నుంచి 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నీకు ఆ స్పృహ ఉందా?. తాగి మాట్లాడావా?.2024 వరకూ అధికారికంగా మేం ఇక్కడ బతకొచ్చే..తర్వాత కూడా మేం బతకొచ్చే?. మరి మీకు ఇక్కడ ఇళ్ళు ఎందుకున్నాయ్. మీ కుటుంబాల్లో అందరికీ అక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయా?. మీ భార్యకు, అత్తగారికి గానీ..మీ కుటుంబాల్లో ఎవరికీ హైదరాబాద్ లో సొంత ఇళ్ళు లేవా?. ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టడం లేదా?.మరి మమ్మల్సి ఎందుకంటారయ్యా?. ట్యాక్స్ అక్కడ కడతారు..మాపై విమర్శలు చేస్తారు అని. ఏపీలో ప్రభుత్వం వచ్చాక కూడా బ్రహ్మండమైన ఇళ్ళు కట్టుకున్నారుగా?. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇంటికి గుంటూరులో ట్యాక్స్ కడతావా?. ఇక్కడ కట్టవా?.

                                          మేం ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ విమర్శలు చేయకూడదా?.మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ..ఇళ్లు  కట్టుకుంటూ..వ్యాపారాలుచేసుకుంటూ విజయవాడలో రాజకీయాలు చేయవచ్చా?. మీ నీతి ఏమిటి?. మాకిచ్చే నీతి ఏమిటి?.మీకు ఎలా అర్హత ఉంది. మాకు ఎందుకు అర్హత లేదు. సరే మాకు అర్హత లేదు. మరి నాన్ ఏపీ వాళ్లను..తెలంగాణ వాళ్ళను ఎందుకు జ్యూరీలో పెట్టుకున్నారు. వాళ్ళకు విమానం టిక్కెట్లు ఎందుకిచ్చారు. స్టార్ హోటళ్ళలో ఎందుకు ఉంచారు. వాళ్ళందరికీ ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్నాయా?.మరి జ్యూరీ సభ్యులుగా వాళ్ళను ఎందుకు పెట్టుకున్నావు?.మీ దృష్టిలో వాళ్ళు నాన్ లోకలే కదా..తెలుగు రోహ్యింగాలే కదా?. లోకేష్ దీనిపై ప్రజలకు సమాధానం చెప్పు.నేను బుద్ధి తెచ్చుకుంటా?. నాకు జ్ణానం కలిగించు. రాద్ధాంతం చేస్తే నందులు రద్దు చేస్తావా?. చాలా విషయాల్లో చాలా మంది  రాద్ధాంతం చేశారు. వాళ్ళు మీ వాళ్లు కాదు. మీ పార్టీ..సైకిల్ గుర్తుపై గెలవలేదు. ఫ్యాన్ గుర్తుపై గెలిచారు. జగన్ పార్టీలో గెలిచారు. మరి వాళ్ళను  పిలిచి కౌగిలించుకుని..ముద్దులు పెట్టుకుని లోపల పెట్టుకున్నారు కదా?. వాళ్లను ఎందుకు ఎత్తిపడేయలేదు. ఇదేం నీతి. ఇలాంటి పొలిటిషన్స్ ప్రజా సేవకులు. దేశాధినేతలు.మేం వినాలి. మా ఖర్మ.

                                భారతరత్న, పద్మశీ అవార్డులపై కూడా విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విమర్శలు తీసుకుంది. బిజెపి విమర్శలు తీసుకుంది. అంతే కానీ అవార్డులు ఎత్తేస్తారా?. తప్పు జరిగింది సరిదిద్దుకో అంటే నాన్ రెసిడెంటా?. చంద్రబాబు మాటల్లోనే తప్పు జరిగిందని అంగీకరించారు. వాళ్లు బాగా చూసుకుంటారని ఇచ్చాం. ఐవీఆర్ఎస్ పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. రేపు ఎప్పుడైనా పెళ్ళాం..పిల్లలతో విజయవాడ వెళితే బతకిస్తారా?. వీడు తెలుగు రోహ్యింగా. వీడిని  తరిమి కొట్టండి అంటారేమో. ఆంధ్రాకు పాస్ పోర్టు రెడీ చేస్తారేమో. ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినోళ్ళే ఉండాలి ఆంధ్రాలో అంటారా?.చెప్పండి. నేను కూడా పోసాని పేరు తీసి నర్సింగ్, యాదగిరి అన్న పేరు మార్చుకుని  ఏ కరీంనగర్ లో ఇళ్ళు కొనుక్కుని ఉంటాం. వాళ్లు కనీసం మమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటారు. ఇలాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రాలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోయేది?.అదృష్టం. రెండు ముక్కలు అవటం.

                           కెసీఆర్ మహానుబావుడు కాబట్టి మేం ఆంధ్రా అని ఫీలింగ్ లేకుండా ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీకు ఏమైనా నీతి, నిజాయతీ గురించి మనస్పూర్తిగా బతకాలంటే వచ్చి కెసీఆర్ దగ్గర కూర్చుని నేర్చుకోండి. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో తెలుసుకోండి. కెసీఆర్ రాజకీయాలు చేయవచ్చు. హామీలుఇచ్చి ఉండవచ్చు. కానీ ఓ మనిషిగా మానవత్వం ఉన్నవాడు.  ఎలా మంచి మాటలు మాట్లాడాలో కెసీఆర్ దగ్గర నేర్చుకోవాలి. ముంబయ్ లో బాల్ థాకరే వాళ్లు ఇతరులను  కొట్టించినట్లు మమ్మల్ని కొట్టించదలచుకున్నావా?. మతకలహాలు రేపదలచుకున్నావా?.ప్రాంతీయ దురభిమానాలు పెట్టదలచుకున్నావా?.నందులకు ప్రాంతీయ తత్వానికి లింక్  ఏంటి?. విమర్శిస్తే నందులు ఇవ్వం అని ఓ పిచ్చిస్టేట్  మెంట్. మీ అబ్బసొమ్మా?. ఏమి స్టేట్ మెంట్ అది. ప్రతిపక్షంలో ఉండగా..చంద్రబాబు ఎన్ని విమర్శలు చేశారు. మరి చంద్రబాబును రాజకీయాల్లో నుంచి వెళ్ళగొట్టారా?.. మీరు నాన్ లోకల్ అని చిత్తూరు పంపించారా?.’ అని పోసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   మంత్రి నారా లోకేష్ మాట్లాడటం రాకపోతే నేర్చుకోవటం మంచిదని..ఓ పది మంది గురువులను పెట్టుకుని శిక్షణ పొంది మాట్లాడితే బాగుంటుందని పోసాని సూచించారు.

Similar News