Full Viewరిలయన్స్ ఇండస్ట్రీస్. దేశంలోని దిగ్గజ సంస్థ. ఈ సంస్థపై ఎప్పటి నుంచో చాలా విమర్శలు ఉంటాయి. ప్రభుత్వ విధానాలను కూడా బడా కార్పొరేట్లు డిక్టేట్ చేస్తారని..తమకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంటారని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇందులో చాలా వరకూ నిజం కూడా ఉంటుంది. అయితే అవకాశాలు కల్పించినా అందుకునే వారు కొందరే ఉంటారు. అయితే అందరినీ వాటిని అందుకోనివ్వరు కూడా..అవి కూడా ఓ ఏజెండా ప్రకారమే సాగుతాయి. రిలయన్స్ జియో భారత్ లో ఎదిగిన తీరే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సరే కాసేపు ఈ అంశాలను పక్కన పెడితే దేశ ఆర్ధిక వ్యవస్థలో రిలయన్స్ కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిపే అంశాలను రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సోమవారం నాడు జరిగిన ఏజీఎంలో వెల్లడించారు.
2022 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి కంపెనీ ఏకంగా 1,88,012 కోట్ల రూపాయల పన్ను చెల్లించిందని తెలిపారు. దేశంలో తమ కంపెనీ అతి పెద్ద పన్ను చెల్లింపుదారుగా ఉందని..అలాగే కొనసాగుతుందన్నారు కూడా. అంతే కాదు దేశంలో ఏకంగా 100 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు నెలకొల్పింది. అంతే కాదు దేశంలో అత్యధికంగా ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థగా కూడా రిలయన్స్ నిలిచింది. గత ఆర్ధిక సంవత్సరం అంటే 2022మార్చితో ముగిసిన కాలంలో ఈ కంపెనీ కొత్తగా 2.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. రిలయన్స్ ఈ దీపావళి నాటికే దేశంలో మెట్రో నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. 2023 డిసెంబర్ నాటికి దేశమంతటా కూడా రిలయన్స్ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.