దేశంలోని ప్రజలందరూ కరోనా కష్టకాలంలో ఉంటే కేంద్రం మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల దరలు పెంచుకుంటూ పోతోంది. దీనిపై విమర్శలు ఎన్ని వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. పైగా దీనికి సమర్దనలు కూడా. పార్లమెంట్ కు కేంద్రం ఇచ్చిన సమాధానంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరలను 76 సార్లు పెంచాయి. తగ్గించింది మాత్రం 10 సార్లు మాత్రమే. అదే డీజిల్ విషయానికి వస్తే 73 సార్లు పెంచి..24 సార్లు తగ్గించారు. ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. తగ్గించేది మాత్రం చాలా తక్కువ. పెంచేది మాత్రం ఎక్కువ. సామాన్యుడి దగ్గర నుంచి మధ్యతరగతి వరకూ పెరిగిన పెట్రో ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల దరలు పెరిగాయి. ఈ ఏడాదే తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీలు దాటాయి. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెట్రో ఉత్పత్తులపై వసూలు చేసే పన్నులతో దేశంలో మౌలికసదుపాయాల కల్పనతోపాటు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రవాణా వ్యయంలో వాహనాల ఖర్చు 34 శాతం ఉంటుందని ఆయన ఓ నివేదికను ఉటంకిస్తూ వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా పన్ను వసూళ్ళు 2020-21లో 88 శాతం మేర పెరిగి 3.35 లక్షల కోట్ల రూపాయలకు చేరారయి.