తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఏపీ సర్కారు తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వం వద్దని..న్యాయపరిష్కారమే కోరుకుంటున్నట్లు ఏపీ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు నివేదించారు. దీంతో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వేరే బెంచ్ కు బదిలీ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ పిటీషన్ ఆయన బెంచ్ ముందు విచారణకు రాగా..తాను రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యక్తినని..తాను ఈ అంశాన్ని టేకప్ చేయలేననన్నారు.
అదే సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని..అందుకు తాను సహకారం కూడా అందిస్తానని తెలిపారు. అయితే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయం తీసుకుని చెబుతానని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించగా..అందుకు అంగీకరించి కేసును బుధవారానికి వాయిదా వేశారు. ఏపీ సర్కారు తన వైఖరిని స్పష్టం చేయటంతో రమణ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ వాదనల సమయంలో కేంద్రం సీజెఐ ధర్మాసమే పిటీషన్ ను విచారించాలని కోరగా ఆయన ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు.