Full ViewFull Viewప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ కోవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరువ అవుతుందనే అంచనాలు వెలువడ్డాయి. ఆదాయాలతోపాటు మార్జిన్లు కూడా మెరుగుపడతాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. దేశీయ పర్యాటకుల సంఖ్యలో పెరుగుదల, తాత్కాలిక ప్రయాణాలతో డిమాండ్ పుంజుకుంటోంది. బిజినెస్ ట్రావెల్ కూడా ఊపందుకుంటోందని ఇక్రా పేర్కొంది. దీంతోపాటు విదేశీ ప్రయాణికుల్లో కూడా కొంత పెరుగుదల ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో హోటల్ ఆక్యుపెన్సీ 68 నుంచి 70 శాతం వరకూ చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రీమియం హోటల్స్ లో గది అద్దె గరిష్టంగా 5600-5800 రూపాయల మధ్య ఉండొచ్చని లెక్కలేశారు.
కోవిడ్ కారణంగా భారీగా నష్టపోయిన రంగాల్లో విమానయాన రంగంతోపాటు హోటల్స్ పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ 56 నుంచి 58 శాతం ఆక్యుపెన్సీతో మంచి ప్రారంభాన్ని నమోదు చేశాయి. ఇది 2022 ఆర్ధిక సంవత్సరంలో 40 నుంచి 42 శాతం మాత్రమే ఉంది. కొన్ని హై ఎండ్ హోటల్స్, విలాసవంతమైన సౌకర్యాలు అందించే హోటల్స్ లో మాత్రం కొన్ని చోట్ల మాత్రం కోవిడ్ ముందు నాటి ధరలను కూడా మించిపోయినట్లు గుర్తించారు. అయితే పూర్తిగా వ్యాపార రంగంపై ఆధారపడే నగరాల్లో మాత్రం రికవరికీ మరికొంత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.