
ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. మోడీ శుక్రవారం నాడు వ్యాక్సిన్ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే వాక్సినేషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ''ప్రపంచం చవక ధరలో సురక్షితమైన వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే అన్ని దేశాల చూపు భారత్ వైపే ఉంది. ఇప్పటికే టీకా ధర, పంపిణీ గురించి రాష్ట్రాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల అధినేతలందరూ మీ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయండి. వాటిని పరిగణనలోకి తీసుకుంటాం'' అని వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు వీలుగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫైజర్ వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పటికే యూకె ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి ఇఛ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 10న అమెరికాకు చెందిన ఎఫ్ డీఏ కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వాక్సిన్ స్టాక్ గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ''ప్రస్తుతం సుమారు ఎనిమిది వాక్సిన్లు వివిధ ట్రయల్ దశల్లో ఉన్నాయి. భారత్లో క్లినికల్ పరీక్షలు పూర్తి చేసుకునే దిశగా మూడు కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి రానున్న కొన్ని వారాల్లోనే దేశంలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాక్సినేషన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతూ మనకు ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి'' అని మోడీ పేర్కొన్నారు.