Full Viewగత కొన్ని రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లో షేర్లు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ మరోసారి తాజాగా 60 వేల పాయింట్లను తాకింది. జూన్, జులై నెలలతో పోలిస్తే ఆగస్టులో షేర్లు భారీగా లాభాలను మూటకట్టుకుంటన్నాయి. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన షేర్ల విలువ జీవిత కాల గరిష్ట స్థాయి 280.5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. స్థిరంగా మార్కెట్లు పెరుగుతూ పోతుండటంతో ఇది సాధ్యం అయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పలు వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారత్ తోపాటు అమెరికాలోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ప్రారంభం కావటంతో మార్కెట్లో సెంటిమెంట్ మెరుగుపడింది.
దీంతో షేర్లు లాభాల బాట పట్టడంతో బీఎస్ఈ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కొత్త రికార్డు స్థాయిలకు చేరింది. ద్రవ్యోల్బణం తగ్గటంతోపాటు విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ పిఐ)లు కూడా తిరిగి దేశీయ మార్కెట్లోకి ప్రవేశించారు. గత కొన్ని నెలలుగా వరస పెట్టి భారతీయ మార్కెట్లలో విక్రయాలు సాగించిన వీరు జులైలో ఓ మోస్తరుగా..ఆగస్టులో మాత్రం భారీ ఎత్తున కొనుగోళ్ళు చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగటానికి కారణం అయింది.