Full Viewవిమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం అయిన ఏ380 విమాన సర్వీసులు అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ ఐటి రాజధాని బెంగుళూరు నుంచి ఈ డబుల్ డెక్కర్ విమానం దుబాయ్ వెళ్లనుంది. బెంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానుండటం ఇదే మొదటిసారి. ఈ విలాస విహంగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఇందులో ప్రీమియం క్యాబిన్స్ తోపాటు ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయని ఎమిరేట్స్ వెల్లడించింది. చాలా మంది విమాన ప్రయాణికులు ఒక్కసారి అయినా ఈ డబుల్ డెక్కర్ విమాన ప్రయాణ అనుభవాన్ని పొందాలని కోరుకుంటారు.
ఇప్పుడు ఇది బెంగుళూరు నుంచి అందుబాటులోకి రానుంది. ముంబయ్ తర్వాత ఈ విలాస విహంగం సేవలు పొందనున్న రెండవ నగరంగా బెంగుళూరు నిలవనుంది. కర్ణాటక రాజధాని నగరం అయిన బెంగుళూరు నుంచి దుబాయ్ కు ఎమిరేట్స్ ప్రతి రోజూ ఈ సర్వీసులను నడపనుంది. బెంగుళూరు నుంచి ఈ అతి పెద్ద విమాన సర్వీసును ప్రారంభిస్తున్న తొలి ఎయిర్ లైన్ తమదే అని ఎమిరేట్స్ తెలిపింది. ఈ విమానంలో ప్రైవేట్ సూట్ లతోపాటు స్పా, ఓపెన్ లాంజ్ బార్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. మరి హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.