కరోనా..వర్షాల టైమ్ లో డెడ్ లైన్లు పెట్టి..
ధరణిలో ఆస్తుల నమోదుపై కోర్టులో మాట మార్చిన సర్కారు
ఓ వైపు ప్రజలకు కరోనా టెన్షన్. మరో వైపు వర్షాలు..వరదల సమస్య. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ సర్కారు 'ధరణి'లో ఆస్తుల నమోదు అంటూ ఇప్పటివరకూ డెడ్ లైన్లు పెట్టి ఆటలాడుకుంది. తాము చెప్పిన తేదీ లోగా నమోదు చేసుకోకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోమని..వాటికి రిజిస్ట్రేషన్లు కూడా జరగవని ప్రకటించారు. దీంతో ప్రజలు అందరూ తీవ్ర గందరగోళానికి గురయ్యారు. పలు చోట్ల ఆన్ లైన్ సమస్యలు...చాలా చోట్ల ఫిజికల్ గా దరఖాస్తుల సమర్పించాల్సి వచ్చింది. ఆన్ లైన్ లో ఆస్తుల నమోదుకు ధరణి పోర్టల్ కూడా ప్రజలకు చుక్కలు చూపించింది. సర్కారు నిర్ణయంతో కరోనా, వరదల సమయంలో కూడా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తీరా సీన్ కట్ చేస్తే తెలంగాణ సర్కారు బుధవారం నాడు ఆస్తుల నమోదుకు గడువు లేదని కోర్టుకు నివేదించటం విశేషం.
స్వయంగా కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు గడువును అక్టోబర్ 20 వరకూ పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు కోర్టులోమాత్రం అసలు దీనికి గడువు లేదని ప్రకటించటం అంటే ఖచ్చితంగా ఈ సంక్షోభ సమయంలో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్నట్లే. ధరణి లో ఆస్తుల నమోదు అంశంపై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది గోపాలశర్మ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సాగింది. ఏ మాత్రం చట్టబద్దత లేకుండా వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
ఆధార్, కులం వంటి వివరాలు అడుగుతున్నారిని తెలిపిన న్యాయవాది. విచారించిన సందర్భంగా సేకరించిన వివరాలు రహస్యంగా ఉంచితే తప్పేంటి అని అడిగిన హైకోర్టు. వెబ్సైట్ ద్వారా వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని కోర్టుకు తెలిపారు. పిటీషనర్ తరపు న్యాయవాది 15 రోజుల్లోనే వివరాలు నమోదు చేయాలంటున్నారని తెలపగా...ధరణిలో ఆస్తుల నమోదుకు గడువు లేదని, నిరంతర ప్రక్రియ అని కోర్టుకు తెలిసిన ఏజీ. ఆస్తుల వివరాల నమోదుకు గడువు లేదన్న ఏజీ వివరణను హైకోర్టు నమోదు చేసింది. ప్రజలకు ఇన్ని రోజులు నానా చుక్కలు చూపించి ఇప్పుడు మాత్రం సర్కారు రివర్స్ గేర్ వేయటం విశేషం.