మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ సీటు భర్తీకి వైసీపీ అధిష్టానం అభ్యర్ధిని ఖరారు చేసింది. ఈ సీటును ఇటీవలే మరణించిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు డాక్టర్ సురేష్ బాబుకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సీటుకు ఆగస్టు 24న ఎన్నిక జరగనుంది. ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు. సంఖ్యాబలం పరంగా చూస్తే ఏకగ్రీవంగానే ఈ ఎన్నిక పూర్తయ్యే అవకాశం ఉంది.