బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన శనివారం నాడు విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చాతినొప్పి, హై బిపి తో తుది శ్వాస విడిచారు. మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తులో బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
కరోనాతో ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన స్వయంగా ఓ వీడియోను విడుదల చేశారు. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని..అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని సూచించిన ఆయన చివరకు కరోనాతో తుది శ్వాస విడవటం విషాదం. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన మంత్రి పదవిని అధిషించారు.