ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై థర్డ్ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రమేష్ కుమార్ పేరుతో ఓ ప్రకటన విడుదల అయింది. తాను ఎస్ఈసీ హోదాలో కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని స్పష్టం చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా ఈ లేఖ విషయాన్ని ధృవీకరించారని తెలిపారు.
దీనిపై అనవసర వివాదాలు, గందరగోళాలు అవసరం లేదని..ఇది పూర్తిగా తన పరిధిలోనే జరిగిందని స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బుధవారం నాడు ఇదే అంశంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రమేష్ కుమార్ లేఖ వెనక టీడీపీ నేతల కుట్ర ఉందని..ఇది వారి పనే అని ఆరోపించారు. ఈ తరుణంలో రమేష్ కుమార్ ప్రకటన రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.