వైసీపీ ఎంపీల రెండు నెలల విరాళం

Update: 2020-03-25 07:50 GMT

కరోనా నియంత్రణ చర్యలకు వైసీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల మొత్తం ప్రధాని మంత్రి సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మానవాళిని కరోనా వైరస్ తీవ్ర సంక్షోభం వైపు తీసుకెళుతోందని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు అన్నారు.

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు సాహసోపేతంగా పనిచేస్తున్నారని అభినందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయని గుర్తుచేశారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇంటికి పరిమితం కావడం చాలా ముఖ్యమని తెలిపారు. పనిచేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు.

Similar News