కరోనాపై ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

Update: 2020-03-20 15:56 GMT

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై ఐక్యరాజ్యసమితి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా లక్షల సంఖ్యలో మరణాలు ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో సంఘీభావాల కంటే అందరూ సంఘటితంగా ఈ సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గ్యుటెరాస్ హెచ్చరించారు. ఆయన కరోనాను కార్చిచ్చుతో పోల్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కారణంగా 10వేల మరణాలు సంభవించగా ఈ వైరస్‌తో ఆరోగ్య పరిస్థితులు రోజురోజుకు మరింత క్షీణిస్తున్నాయని తెలిపారు.

ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాల్లో పరిస్థితలను చక్కబెట్టుకుంటూ ఇతర దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. ఎవరికి వారు రక్షణ చర్యలు చేపడుతూనే ఇందుకు ఇంకా సంసిద్ధం కాని దేశాలను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో జీ20 దేశాలు మరింత చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దేశాలను వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆదుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి సూచించింది.

Similar News