పాత్రికేయ దిగ్గజం పొత్తూరి మృతి

Update: 2020-03-05 05:35 GMT

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) గురువారం నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ప్రముఖ పత్రికల్లో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు.

అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్‌ ఆఫ్‌ పవర్‌’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. పొత్తూరి మృతికి తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా ఆయన సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు.

Similar News