జగన్ ను కలసిన పరిమల్ నత్వానీ

Update: 2020-03-10 11:31 GMT

వైసీపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార భాగస్వామి పరిమల్ నత్వానీ మంగళవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. తనకు రాజ్యసభ సీటు కేటాయించినందుకు ఆయన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని..సీఎం సూచనలకు అనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తానని అన్నారు. నత్వానీ బుధవారం ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జగన్ తో భేటీ ముందుకు ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ కోటాలో రాజ్యసభ సీటు దక్కించుకున్న మోపిదేవి వెంకటరమణ, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిలు కూడా మంగళవారం నాడు జగన్ ను కలసి తమకు అవకాశం కల్పించినందుకు ధ్యాంక్స్ చెప్పారు.

 

 

 

 

Similar News