స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో సాగుతున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై బిజెపి ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి ఫిర్యాదు చేయటంతోపాటు లేఖ కూడా రాశారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ అమిత్షాకి లేఖ ఇచ్చామని, వైసీపీ దాడులు, అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ఎన్నికల అధికారులు వైసీపీకి సహకరిస్తున్నారని, నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. కోర్టు చెప్పినా వైసీపీ పార్టీ రంగులను తొలగించలేదని, ఎన్నికల సంఘం, డీజీపీ సరైన తీరులో స్పందించకపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని జీవీఎల్ తెలిపారు.