తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బలం మరింత పెరిగింది. స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఎమ్మెల్యే కోరకంటి చందర్ టీఆర్ఎస్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన బుధవారం నాడు హైదరాబాద్ లో మంత్రి కెటీఆర్ ను కలిశారు. చందర్ రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. వాస్తవానికి ఆయన గతంలో టీఆర్ఎస్ సభ్యుడే. అధిష్టానం టిక్కెట్ నిరాకరించటంతో బయటకు వెళ్లి ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చారు. దీంతో టీఆర్ఎస్ బలం 88 నుంచి 89కి చేరింది. రాబోయే రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి క్యూ కట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కెటీఆర్ తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తనకు మాతృసంస్థ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్ తెలిపారు.