తెలంగాణ మంత్రి కెటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో అక్రమంగా సంపాదించిన డబ్బును ఆయన సింగపూర్, మలేషియాల్లో పెట్టుబడులుగా పెట్టారని ఆరోపించారు. ఆంధ్రా పారిశ్రామికవేత్తలు..సినీ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆస్తులు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం చీకటి వ్యాపారాలు చేసి ఆస్తులు పెంచుకుందని విమర్శించారు. మధుయాష్కి శనివారం మీడియాతో మాట్లాడారు. 2009లో కేటీఆర్కు కోటిన్నర ఆస్తి ఉండగా.. ఆ మొత్తం 2014లో ఏడుకోట్ల తొంభై లక్షలకు, 2018లో 41 కోట్ల రూపాయలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు కొడుకు హర్షవర్ధన్ నాయుడు, సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజులు కేటీఆర్ వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.
రూ.1500 కోట్ల కాంట్రాక్టును కేటీఆర్ తేజారాజు కంపెనీకి దోచిపెట్టారని ఆరోపించారు. ‘కాల్ హెల్త్’ కేటీఆర్ బినామీ కంపెనీ అనీ, ఆ కంపెనీకి తేజారాజు భర్య చీఫ్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎంపీ కల్వకుంట్ల కవిత బెంగుళూరులోని డాలర్స్ కాలనీలో నిర్మించిన బంగ్లా వివరాలు రేపు బయటపెడతామని మధుయాష్కి పేర్కొన్నారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అక్రమాస్తులను బయటపెడతామని తెలిపారు. కేసీఆర్ ఉరఫ్ దుబాయ్ శేఖర్కు నకిలీ పాస్పోర్టు, దొంగనోట్ల స్కామ్ల చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు.