తెలంగాణ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డిపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఆయన గాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. వంశీచంద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలింగ్ బూత్ను పరిశీలించడానికి వెళ్లిన ఆయనపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే బిజెపి నేతలు మాత్రం తమకు.. ఈ దాడికి సంబంధం లేదని చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాడి ఘటనపై స్పందించారు. ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్, బిజెపి నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.