జగన్ పాదయాత్ర..ఫైనల్ కు

Update: 2018-11-26 07:20 GMT

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర తుది అంకానికి చేరుకుంది. ఇఫ్పటికే 12 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసిన జగన్ ఆదివారం నాడు చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలోకి అడుగుపెట్టారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్ కూడా తన పాదయాత్రను ఇచ్చాపురంలో ముగించనున్నారు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలను బస్సు యాత్ర ద్వారా తిరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కేంద్రం పార్లమెంట్ ఎన్నికలను కొంత ముందుకు జరపవచ్చనే ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే జగన్ ప్రణాళికలో కూడా మార్పులు చేసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు కొంచెం ముందుకు జరిగితే వాటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయనేది బహిరంగ రహస్యమే. శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు సరిహద్దులో భారీ స్వాగతం లభించింది. పాలకొండ శాసనసభా నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కెల్ల గ్రామంలోకి జగన్ అడుగు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 350 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర సాగనుంది.

 

 

Similar News