చంద్రబాబుపై కెసీఆర్ సంచలన ఆరోపణలు

Update: 2018-10-03 15:12 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు 500 కోట్ల రూపాయలు సమకూర్చటంతోపాటు..హెలికాప్టర్లు సమకూరుస్తారట అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అడుక్కుంటే తామే కాంగ్రెస్ కు ఓ నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం కదా? అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబుకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తాకట్టుపెడతారా? అని ప్రశ్నించారు. కెసీఆర్ బుధవారం నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు కోర్టు కేసులతో ఇబ్బంది పెడుతున్నందునే ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవినీతికి దూరంగా పనిచేసి..ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టామన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందకుండా టీడీపీతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ అనేక కుట్రలకు పాల్పడుతోందని.. ఆ పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘ప్రాజెక్టులు కట్టకుండా ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. తెలంగాణ రైతన్నలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధం పథకం రెండో విడుత చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని కేసుల వేస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. రైతుబంధు పథకం, పంటలకు 24గంటల ఉచిత కరెంట్‌, రైతులకు సబ్సిడీ రుణాలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇలా దేశంలో నెంబర్‌ వన్‌గా నిలబెడుతుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి’ అని ఆరోపించారు.

 

Similar News