అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు మరో షాక్. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ గుడ్ బై చెప్పారు. హస్తానికి హ్యాండిచ్చి ఆయన పిడికిలి పట్టుకోనున్నారు. జనసేనలో చేరేందుకు వీలుగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని..కాంగ్రెస్ లో ఉంటూ తన వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానని తెలిపారు.
జనసేనలో టిక్కెట్ ఆశించి కూడా చేరటంలేదని..పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చే జనసేనలో చేరనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి పర్యటన సందర్భంగా ఆయన జనసేనలో అధికారికంగా చేరనున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.