‘ఇండిగో’ నుంచి 12 లక్షల చౌక సీట్లు

Update: 2018-07-10 15:58 GMT

దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్ లో ఒకటైన ‘ఇండిగో’ భారీ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఏకంగా 12 లక్షల చౌక సీట్లను ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. తన 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. ఇండిగో సర్వీసులు ఉన్న అన్ని రూట్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ మెగా సేల్ మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ సేల్ లో టిక్కెట్ల ప్రారంభ ధర 1212 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టిక్కెట్లపై ప్రయాణాలు మాత్రం జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ చేయవచ్చని ఇండిగో ప్రకటించింది.

సహజంగా వర్షాకాలంలో ఎయిర్ లైన్స్ లో ఆక్యుపెన్సీ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసుకునేందుకు గాను ప్రతి ఎయిర్ లైన్స్ ఈ సీజన్ లో ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటాయి. దీని ద్వారా ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునే పనిలో పడతాయి. ఎస్ బిఐ క్రెడిట్ కార్డుతో బుక్ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా వర్తింపచేస్తున్నాయి. అయితే ఈ కొనుగోళ్లు 3000 రూపాయలు ఉండాలి. ఇప్పటికే స్పైస్ జెట్ తో పాటు ఇతర ఎయిర్ లైన్స్ కూడా ఈ తరహా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News