టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి...ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందా?. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. అంతే కాదు..రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగానే ఉత్తమ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను పార్టీ కోసం పనిచేసేందుకు రెడీగా ఉన్నా..తనను సరిగ్గా ఉపయోగించుకోవటంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని ఆరోపించారు. విలేకరుల సమావేశం అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంకా చాలా వయస్సు ఉందని..ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తాను సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వర్కింగ్ ప్రెసిండెంట్ పదవి ఇచ్చినా తాను వద్దని చెప్పినట్లు తెలిపారు. పార్టీలో చేర్చుకునేటప్పుడు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరపున వచ్చిన దూతలు చాలా హామీలు ఇచ్చారని పేర్కొన్నారు.
వాళ్లు ఏం హామీలు ఇచ్చారో వారికి తనకు మాత్రమే తెలుసునంటూ వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగిన పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు తన మాటను వింటారని, తన సలహా మేరకే వేటుపడిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్లు దీక్ష చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయటం కీలకంగా మారింది.