మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు వందల కోట్ల రూపాయల క్లబ్ లో చేరాడు. రంగ స్థలం సినిమా ద్వారా ఈ మెగా హీరో కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ ను దాటేసింది. రాబోయే రోజుల్లోనూ ఇది మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచి వసూళ్ళ వర్షం కురిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ కెరీర్ లో ఇంత భారీ మొత్తం వసూలు చేసిన తొలి చిత్రం ఇదే కావటం విశేషం.
నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్-బాహుబలి) నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. సమంతకు అయితే ఇది కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలవటం ఖాయం. పొలిటికల్ విలేజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, పాటలకు సాహిత్యం, ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది.