అసలే నెగిటివ్ టాక్ తో కష్టాల్లో ఉన్న అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. ఓ వివాదం సద్దుమణగగా..ఇప్పుడు కొత్త కష్టాలు తెరపైకి వచ్చాయి. దీంతో రాబోయే రోజుల్లో చిత్ర యూనిట్ చిక్కుల్లో పడే అవకాశం కన్పిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఫ్రెంచ్ సినిమాను పూర్తిగా కాపీ కొట్టడమే. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అసలు సినిమా లార్గో వించ్(ఫ్రెంచ్) దర్శకుడు జెరోమ్ సల్లే సిద్ధమైపోయారు. ఈ మేరకు తన ట్విటర్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. ‘‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్ నోటీసులు పంపటం ’’ అంటూ ఆయన పేర్కొన్నారు.
ఇండియాలో ఫెంచ్ సినిమా నుంచి రీమేక్ హక్కులను దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపటంతో.. చివరకు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ వెంటనే తెర పైకి వచ్చిన లార్గొ వించే దర్శకుడు జెరోమ్ సల్లే చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన కథనాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దించేశాడని సినిమా చూశాక సల్లే వ్యాఖ్యానించి సంచలనానికి కారణం అయ్యారు. ‘‘సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో?’’ అంటూ మరో ట్వీట్ చేసి చర్యలకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందించారు.