Telugu Gateway
Politics

వంద‌ల కోట్లు ఉన్నాయి..ఎప్పుడైనా పిల్లికి బిచ్చంపెట్టారా?

వంద‌ల కోట్లు ఉన్నాయి..ఎప్పుడైనా పిల్లికి బిచ్చంపెట్టారా?
X

వైసీపీపై ప‌వ‌న్ ఫైర్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ వేదిక‌గా అధికార వైసీపీ పై ఘాటు్ విమ‌ర్శ‌లు చేశారు. పేరు పెట్ట‌కుండా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. 'మీకు లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు దానిని పక్కన పెడితే మీరే రూ. 700 కోట్లు ఉన్నాయని ప్రకటించారు. ఏం చేసుకుంటారు అంత డబ్బు. పేదలకు పంచొచ్చు కదా? మీరు ఇప్పటి వరకు పిల్లికి బిచ్చమేయడం మేము చూడలేదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. అంత పినాసివాళ్లు మీరు. అలాంటి మీరా మా గురించి మాట్లాడేది. మీరు ఎప్పుడైనా సైనిక బోర్డుకు కోటి రూపాయలు ఇచ్చారా? మీరేమో మమ్మల్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు మేము మాత్రం ఒక్క మాట కూడా అనకూడదా? రాష్ట్రం మీ ఇడుపులపాయ ఎస్టేట్ కాదు. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా.. సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి. మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారికి తల వంచుతాం. సుబాష్ చంద్రబోసుకు తలదించుతాం. భగత్ సింగ్ కు జోహార్లు అర్పిస్తాం. గాంధీజీకి మోకరిల్లుతాం. మీలాంటి వాళ్లకు తాటతీస్తాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయం... వచ్చేది జనసేన ప్రభుత్వమే' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.. వైసీపీ ఇప్పుడు 151 సీట్లతో ఉంది... తదుపరి 15 సీట్లకే పరిమితమవుతుంది అన్నారు. యుద్ధం ఖాయం... ఏ స్థాయిలో... ఎలా కావాలో వైసీపీ నేతలు కోరుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

వైసీపీ నాయకత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా.... మీరో మేమో తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సన్నాసులకి... వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పని సంస్కారాన్ని నేను నేర్పగలనా? కానీ సరిగా నూనూగు మీసాలు రాని కుర్రాళ్లు మాత్రం మీకు సంస్కారం నేర్పిస్తారు. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు అధికారం అహంకారం పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం ఒక్కటే. ఆ భయం అంటే ఎలా ఉంటుందో నేను మీకు నేర్పిస్తాను. అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా.. బయటకి లాగి కొడతా.. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు చట్టపరంగా శిక్షలు పడతాయి. ఆ బాధ్యత జనసేన తీసుకుంటుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేను చాలా బాధ్యతగా ఉంటున్నా. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నా. మాట తూలను. నాకు బూతులు రాక కాదు. మాట్లాడలేకా కాదు. మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను. వైసీపీ వాళ్లకు మాత్రమే బూతులు వచ్చా. మీరు ఒక్క భాషలో తిడితే మేము నాలుగు భాషల్లో తిడతాం. ఒక్క రోజు సమయం ఇస్తే మీరు కోరుకున్న భాష నేర్చుకుని మరీ తిడతా. తెలంగాణలో ఒక సామెత ఉంది. అల్వాల్ ఎటుపోవాలి అంటే లేదన్నా నేను ఉల్వలు దున్నుతున్నా అన్నాడంట. అడిగేది ఏంటి అంటే.. వాడు కావాలని అలా చెబుతున్నాడు. అలాగే వైసీపీ వాళ్లను నేనేమడుగుతున్నా. మీ సొంత చిన్నాయన వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు... ఎవరమ్మా చంపింది అని అడుగుతున్నా. మరి ఆ రోజు కోడికత్తి వేసింది ఎవరు? ఆ రోజున అంత అరిచి గోల చేశారు. కేంద్రం కంట్రోల్లో, నిఘా వ్యవస్థ కంట్రోల్లో ఉండి. భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉంటే అంత గోల చేశారే.. అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారుగా. ఇప్పుడు చెప్పండి సమాధానం.

రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతారు. నా వ్యక్తిగత జీవితం ఏముంది? మీవి కదా రంగుల కలలు. నేనెప్పుడూ లైన్ దాటి మాట్లాడను. మీ వైసీపీ అధినాయకుడు కూడా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. నేను మాట్లాడలేకా? నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. మీ అందరి సాక్షిగా చెబుతున్నా- మీ ఆడబిడ్డలకు చాలా గౌరవం ఇస్తా. వైసీపీ కార్యకర్త కుటుంబంలోని ప్రతి ఆడబిడ్డ నుంచి మీ అధినేత భార్య వరకూ అందరికీ గౌరవం ఇస్తాం. అమ్మా నేను మీకు మాటిస్తున్నాను.. మీ వాళ్లు మాట తప్పుతారేమోగానీ మేము తప్పం. మిమ్మల్ని నేను ఒక్క మాట అనను. మా వాళ్లు అనరు. వైసీపీతోనే తేల్చుకుంటాం. పారిపోయే వ్యక్తులం కాదు. మీలా మాట తప్పం మడమ తప్పం అని చెప్పడం కాదు ఆచరణలో చూపుతాం. మొన్న సినిమా టికెట్లు గురించి అడిగాను... నాకేమైనా థియేటర్లు ఉన్నాయా సన్నాసుల్లారా? రాష్ట్రంలో ఎక్కువ థియేటర్లు ఎవరికి ఉన్నాయి. వైసీపీ వాళ్లకే ఉన్నాయి. కాకినాడ, నెల్లూరులో థియేటర్లు వైసీపీ వాళ్లవు కావా? టికెట్లు రేట్లు పెంచితే నాకేంటి.. తగ్గిస్తే నాకేంటి? సినిమాలతో డబ్బు సంపాదించాలనే కోరిక నాకు ఏనాడూ లేదు. నా మొదటి సినిమాకు కేవలం నెలకు రూ. 5వేలు మాత్రమే తీసుకున్నాను. జానీ సినిమాకు మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేశాను. నేను అడిగింది టికెట్లు గురించి కాదు. ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవ్వరు దోచుకోవడానికి అని అడిగాను. ఒట్టి గొడ్డుకు అరువులెక్కువ వానలేని మబ్బుకు ఉరుములెక్కువ అన్నట్లు వైసీపీ నాయకులు అరుస్తున్నారు. ఏ రోజైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారా? మేము అడిగి నెల రోజులు అవుతుంది ఈ రోజుకి పాడైనా ఒక్క రోడ్డైనా మరమ్మతు చేశారా? ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి ఏడు కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్డును హడావుడిగా రెండు రోజుల్లో వేసేస్తారా? మేము నమ్మాలా? వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా అవ్వనివ్వండి... వేల కోట్లు ఉండనివ్వండి... మీ కింద కిరాయి సైన్యం పని చేయనివ్వండి.. అలాంటి వాటికి మాత్రం భయపడే వ్యక్తులమయితే మేము కాదు. తోడేళ్ల గుంపు జీతం లేకుండా గొర్రెలు కాపాలా కాస్తామంటే మనం నమ్ముతామా? అలాగే వైసీపీ వాళ్లు అవినీతి లేకుండా పాలన చేస్తామంటే నమ్ముతామా? ఏటా రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్ష కోట్ల పైమాటే. ఈ లక్ష కోట్లు ఏం చేస్తున్నారు. జీతాలు సరైన సమయానికి ఇవ్వరు. పెన్షన్లు సమయానికి ఇవ్వరు. రెండో వారమో మూడో వారమో ఇస్తారు. ఇది ఇవాళ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి. దీని గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా తిడతారు. ఒక రాజకీయ పార్టీ ఎదగాలన్నా, పోరాటం చేయాలన్నా వర్గ శత్రువు కావాలి. టీఆర్ఎస్ పార్టీకి వర్గ శత్రువులు ఆంధ్ర పాలకులు, వైసీపీ వాళ్లకు వర్గ శత్రువులు కమ్మవాళ్లు. జనసేన పార్టీకి వర్గ శత్రువు ఎవరని చాలా మంది నన్ను అడిగితే చెప్పడం చాలా కష్టమైంది. కానీ ఈ రోజు చెబుతున్నాను దాష్టీకానికి పాల్పడినవాళ్లు, దౌర్జన్యం, దోపిడి చేసిన వాళ్లు జనసేన పార్టీకి వర్గ శత్రువులు. వాళ్లను ఎప్పటికీ మా ప్రత్యర్ధులుగానే భావిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అద్భుతమైన ప్రగతి సాధించాలి. కానీ వాళ్లు పాలనపై దృష్టి పెట్టకుండా ఇతరులను ఎదగనివ్వకుండా? ఒక కులాన్ని సమూలంగా తుడిచిపెట్టేద్దాం అంటే కుదిరే పనేనా? ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వర్గ శత్రువులు లేరు. కాపు రిజర్వేషన్లు మీద మీ స్పందన ఏంటి అని చాలా మంది నన్ను అడిగారు. తునిలో చిన్న పొరపాటు కారణంగా ఉద్యమం ఎటు కాకుండా పోయింది. ఆ రోజు మీటింగ్ సందర్భంలో రైలు పట్టాల మీదకు వెళ్లి ట్రైన్ ను ధ్వంసం చేస్తారని ఎవరికీ ఊహించలేదు. ఉద్యమం ముసుగులో కొందరు వైసీపీ వర్గాలు దూరిపోయి చేసిన ధ్వంస రచన కారణంగా ఉద్యమం మసకబారిపోయింది. ఈ రోజుకి కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో దళితుల హక్కులు కాలరాస్తున్నారు. నోరు మెదపలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక కులంపై కక్ష కడితే అది రాష్ట్రాన్నే దహించి వేస్తుంది. వైసీపీ చేస్తున్న తప్పు కూడా అదే. వారు వర్గ శత్రువుగా ప్రకటించుకున్న కమ్మవారితో జరుగుతున్న పోరాటంలో రాష్ట్రాన్ని, రాష్ట అభివృద్ధిని తగలబెట్టేస్తున్నారు. నన్ను ఒక్కసారి గెలిపించండీ అని నేను అడగను. నన్ను గెలిపిస్తే మాత్రం రాష్ట్రాభివృద్ధి, శాంతిభద్రతలు ఎలా ఉంటాయో మాత్రం చూపిస్తాను. రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే నేను ఎవరితోనైనా కలుస్తాను. అవసరమైతే వ్యూహం మారుస్తాను. భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు ఇదే అడిగాను. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటును తొలగించాలి. రాయలసీమ నుంచి వలసలను నిరోధించాలని కోరాను. వాళ్లు దానికి అంగీకరించడంతో వాళ్లతో కలిశాను. రాజకీయాల్లో నాకు ఎవ్వరూ లేరు. మా నాన్న ముఖ్యమంత్రి కాదు.

మా మామ ముఖ్యమంత్రి కాదు. మా తండ్రి కానిస్టేబుల్ గా జీవితం మొదలు పెట్టారు. మా నాన్న నాకు వారసత్వంగా పెద్ద పెద్ద కారులు ఇవ్వలేదు. ఆస్తులు ఇవ్వలేదు. ఇడుపులపాయ లాంటి ఎస్టేట్లు ఇవ్వలేదు. వేల కోట్ల సంపాదన ఇవ్వలేదు. మా నాన్న నాకిచ్చింది ధైర్యం, తెగింపు, ధర్మపరిరక్షణ. ఇది మనందరి ప్రయాణం కాబట్టి బాధ్యతగానే తీసుకుంటాను. సమయం తీసుకున్నా జాగ్రత్తగానే ఉంటా. నేను నడిచి చూపిస్తా మీకు ఇష్టమైతే నాతోపాటు రండి. నేను మిమ్మల్ని ఏం అడిగినా ఎప్పుడు అడిగినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే అడుగుతాను. నాకేంటి సరదా? నేనెప్పుడూ సినిమా హీరోని కాదు. నటుడిని అవ్వాలని కోరుకోలేదు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తప్ప నాకేం తెలియదు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న అంశాన్ని త్రికరణ శుద్దిగా నమ్మిన వాడిని. నేను తోటలో పాదును చాలా శుభ్రం చేసి కలుపు తీసి మొక్కని ఏపుగా ఎదిగేలా చేయగలను. అలాగే రాజకీయాల్లో కూడా కలుపు మొక్కల్ని తీసేసి బలమైన అభివృద్ధి వైపు తీసుకెళ్తాను. ఎలాంటి పని ఎంచుకున్నా అంతే శుభ్రంగా చేస్తాను అంటూ వ్యాఖ్యానించారు.

Next Story
Share it