గత కొన్ని రోజులుగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు శుక్రవారం రాత్రి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనపై టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కూడా కొత్తగా కేసులు పెట్టింది. ముఖ్యమంత్రి కెసీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఈ కేసులు పెట్టారు. అయితే గతంలో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి మల్లన్నను ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. తనను డబ్బులు డిమాండ్ చేశారని మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిదానందు లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి మల్లన్నను అరెస్టు చేశారు. ఉప్పల్లోని మల్లన్న నివాసం నుంచి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈనెల 3వ తేదీన చిలకలగూడ పోలీస్స్టేషన్లో విచారించిన పోలీసులు.. 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరారు.
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని న్యాయవాది ద్వారా సమాచారం పంపిన మల్లన్న విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. తనను 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఏప్రిల్ 22న లక్ష్మీకాంత్ శర్మ.. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, దీనిపై న్యాయబద్ధంగా పోరాటం చేస్తామన్నారు తీన్మార్ మల్లన్న.