రెండు తెలుగు రాష్ట్రాల్లోని బిజెపి నేతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వినాయకచవితి ఉత్సవాల అంశం ఆధారంగా వీరు జగన్ ను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణకు చెందిన ఫైర్ బ్రాండ్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా జత కలిశారు. హిందువుల మనోభావాలను ఏపీ సీఎం జగన్ కించపరుస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న నిబంధన సరికాదని తప్పుబట్టారు. కొవిడ్ నిబంధనలతో గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు అవకాశమివ్వాలని కోరారు.