తెలంగాణలో డ్రగ్స్ వాడకం..అమ్మకాలను నియంత్రించేందుకు చేపట్టాలని చర్యలపై సీఎం కెసీఆర్ శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అందులో భాగంగా తొలుత ఇప్పటికే డ్రగ్స్ బానిసలు మారిన వారిని గుర్తించి, వారిని వారు కుటుంబ సభ్యులు సహకారం తీసుకొని డీ అడిక్ట్ చేయడం కోసం తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత.. డ్రగ్స్ వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం వారికి అందుతున్న డ్రగ్ నెట్ వర్క్ లింక్ ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలని, నిష్ణాతులైన చురకల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై పోరు సాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి డ్రగ్స్ నేరస్థులను గుర్తించి పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. స్కాట్లాండ్ యార్డ్ మాదిరిగా... డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు.
ఎంత ఖర్చయినా పర్వాలేదని, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. గంజాయి తదితర డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలని, డ్రగ్స్ కంట్రోల్ విషయాలలో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలనీ సీఎం అన్నారు. అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి కొకైన్ ఎల్సీడి వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం వైపు ఎక్కువగా యువత ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, ధనవంతులు పేదలు అనే బేధం లేకుండా అన్ని తరగతుల కుటుంబ సభ్యులు తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని తమ పిల్లల అలవాట్ల పై దృష్టి సారించాలని సీఎం కోరారు. డ్రగ్స్ వాడకం అత్యంత ప్రమాదకారని, దానిన కూకటివేళ్లతో నాశనం చేయకుంటే మనం సంపాదించే ఆస్తులకు, సంపాదనకు అభివృద్ధికి అర్థం లేకుండాపోతుందని సీఎం స్పష్టం చేశారు.
డ్రగ్స్ కంట్రోల్ లో సమాజం సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. అందుకు.. గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్, విద్యార్థులతో సమావేశాలు సజావుగాఅవగాహన సదస్సు లు నిర్వహించాలని సీఎం సూచించారు. ఈ దిశగా స్ధానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచలని సీఎం అన్నారు. గ్రామం లో ఏ రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు రుజువైనా ఆ సమాచారం అందించక పోతే ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని..ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్థులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిని సీఎం కేసిఆర్ ఆదేశించారు. ఇది అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా బాధ్యతతో మనసు మీదికి తీసుకుని డ్రగ్స్ కంట్రోల్ విషయంలో కృషి చేయాలనీ సీఎం స్పష్టం చేశారు. అనుభవం ఉన్న ప్రతి అధికారిని డ్రగ్ కంట్రోల్ అంశంలో వినియోగించుకోవాలన్నారు. వ్యవస్థీకృత నేరాలను కంట్రోల్ చేస్తున్న విధంగా పి.డి.యాక్ట్ లు కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
" మీరు ఏమి చేస్తారో ఏమో..ప్రభుత్వం మీకు పూర్తి సహకారం అందిస్తుంది..మీరు రాష్ట్రం లో డ్రగ్స్ వాడకం లో వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి చేపట్టాల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టాల" నీ సీఎం డీజీపీ నీ ఆదేశించారు. డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయి కి చేరుకోలేదనీ, రాష్ట్రం లో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుడిచేయాలనీ సీఎం అన్నా రు .నేరస్థులను పట్టుకొని విచారించే క్రమంలో కీలకమైన 'ఫోరెన్సిక్ ల్యాబ్స్' ను మరిన్నిటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాల ముందు డ్రగ్స్ నేరస్థులను ప్రవేశపెట్టినప్పుడు కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల ప్రాసిక్యూషన్ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.