
గవర్నర్ కు కాంగ్రెస్ వినతి
తెలంగాణలో కలకలం రేపిన న్యాయవాద దంపతుల హత్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నాడు గవర్నర్ తమిళ్ సైకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అధికార టీఆర్ఎస్ నేతల అక్రమాలు అడ్డుకుంటూ, హైకోర్టులో కేసు వేసినందుకే వీరిని చంపారని ఆరోపించారు. పోలీసులు స్థానిక టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ''పుట్టా మధుకు స్థానిక పోలీస్ కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. సీఎం కేసీఆర్కు పుట్టా మధు సన్నిహితుడు'' అని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.
స్థానిక పోలీసులతో కేసు ముందుకు సాగదన్నారు. నేరుగా కోర్టు ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామని ఆయన వెల్లడించారు. ఈ హత్య ఘటనపై సీజేఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతికి లేఖ రాసామని పేర్కొన్నారు. లాయర్ వామన్రావు దంపతుల హత్య చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. శీలం రంగయ్య అనే దళితుడు లాకప్ డెత్పై వామన్రావు దంపతులు కోర్టులో కేసు వేశారన్నారు. స్థానిక పోలీస్ కమిషనర్ పట్టించుకోవడం లేదని.. కోర్టు పట్టించుకోవాలని వారు కోరారని, కానీ వారికి ప్రాణాలే పోయాయని పేర్కొన్నారు. రామాలయం భూమి, అంతకుముందు రెండు మూడు ఘటనలకు లింక్ పెడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రమాదం ఉందన్నారు.