బోయినపల్లి అభిషేక్ ను అరెస్ట్ చేసిన సీబీఐ..ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా తదుపరి
కీలక పరిణామం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కేంద్రంగా అరెస్ట్. ఇది ఇక్కడితో ఆగుతుందా..మరిన్ని అరెస్ట్ ల ఉంటాయా అన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో ఉంది. విచారణ సంస్థల పలు దఫాల సోదాల అనంతరం సీబీఐ సోమవారం నాడు ఈ స్కామ్ కు సంబంధించి బోయినపల్లి అభిషేక్ ను అరెస్ట్ చేసింది. ఆయన్ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని సీబీఐ కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. మరి ఇప్పుడు అభిషేక్ ఇచ్చే సమాచారం ఇచ్చే ఆధారంగా భవిష్యత్ అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ సీఎం కెసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఈ స్కామ్ లో తెరపైకి రావటంతో దీనిపై అందరి ఫోకస్ పడింది. అదే సమయంలో ఐటి, ఈడీల సోదాల సమయంలోనూ పలువురు నేతలు టెన్షన్ కు లోనైనట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ కేంద్రంగా అరెస్ట్ లు జరగటంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అభిషేక్ సంస్థల ఖాతాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ మీడియా సంస్థ ఖాతాకు ఆరు కోట్ల రూపాయల నిధులు బదిలీ అయ్యాయి.
ఓ విడత రెండు కోట్ల రూపాయలు, తర్వాత నాలుగు కోట్ల రూపాయలు ఈ మీడియా సంస్థకు బదిలీ అయినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి. ఆయన అరెస్ట్ లో ఇది కూడా కీలకంగా మారిందని చెబుతున్నారు. అయితే ఈ నిధులు ఎందుకు బదిలీ చేశారు..బదిలీ అయిన నిధులు ఇతర ఖాతాలకు మళ్ళాయా అన్న కోణంలోనూ విచారణ సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే ఈడీ అధికారులు హైదరాబాద్ కేంద్రంగా ఓ మీడియా సంస్థ, ఆ సంస్థల అధినేత ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు మరో కీలక మీడియా సంస్థ ఆర్ధిక లావాదేవీలపైనా నజర్ పెట్టాయి విచారణ సంస్థలు. ఆ మీడియా సంస్థకు వచ్చిన ఆదాయం కూడా దాని అవసరాల కోసం కాకుండా పలు రియల్ లావాదేవీలు..ఇతర వ్యాపారాలకు మళ్ళించినట్లు విచారణ సంస్థలు గుర్తించాయి. భూముల రెగ్యులరైజేషన్ కోసం కూడా ఈ మీడియా సంస్థల ఖాతా నుంచి నిధుల వాడినట్లు చెబుతున్నారు.