ఉద్యోగుల్లో చీలిక‌కు కెసీఆర్ ప్ర‌య‌త్నాలు

Update: 2021-12-13 04:50 GMT

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ జీవో 317 విష‌యంలో ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. రాజకీయంగా త‌న‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి సీఎం కెసీఆర్ ఏదో ఒక కొత్త వివాదాన్ని తెర‌పైకి తెచ్చి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తారని మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న సోమవారం నాడు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులోని ముఖ్యాంశాలు..' ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడింది. ముఖ్యమంత్రి తుగ్లకు పాలనకు ఇది నిదర్శనం.స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయ లబ్ది పొందే కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారు.

పాత సమస్యను దారిమళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం సీఎంకు అలవాటుగా మారింది.ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలనూ దాచిపెడుతూ... తనకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటకు తీస్తూ రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం స్రుష్టిస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం స్రుష్టిస్తున్న ఈ జీవో అమలును తక్షణమే నిలిపివేయాలి. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తిని దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలి.' అని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News