Full Viewఆచార్య పాన్ ఇండియా సినిమా కాదు. ఒక్క మాటలో చెప్పాంటే భారీ బడ్జెట్ సినిమా కూడా కాదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టిక్కెట్లు రేట్లు పెంచారు. ఆచార్య సినిమా టిక్కెట్ రేట్ల పెంపు గురించి మెగాస్టార్ చిరంజీవిని మీడియా ఓ ప్రశ్న అడిగితే కరోనా మహమ్మారి కారణంగా ప్రతి రంగం కుంటుపడిందని..మాస్టారు మాకూ చేయూత ఇస్తారా అంటే కాదంటారా. అదే పరిస్థితి..ప్రతి రంగం కుదేలు అయింది. ఏభై కోట్ల వడ్డీ..మీరెప్పుడైనా విన్నారా. మేం చెల్లించాం. ఎవరిస్తారు చెప్పండి. ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే ప్రేక్షకులకు ఇంత వినోదం ఇచ్చారు..ఓ పది రూపాయలు వేద్దాం అంటూ వాళ్లందరూ కూడా ఇది చేశారు. అది అడుక్కుతినటం కూడా కాదు. అవసరంలో ఉన్నారు..ఖర్చు పెట్టారు. ఒక వినోదం ఇద్దామని హయ్యస్ట్ బడ్జెట్ ఖర్చుపెట్టాం. అనుకోని పరిస్థితుల్లో దానికి అంతకంతకూ వడ్డీలు అయిపోయాయి. ఒక మీడియం సినిమా అంత బడ్జెట్ అయింది మా వడ్డీలు. మేం అత్యధిక పన్నులు కడుతున్నాం. అందులో మాకు కొంత ఇవ్వమని అడుగుతున్నాం. తప్పేమీలేదు అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
అంతకు ముందు దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ మరింత విచిత్రంగా స్పందించారు. తాము ఇంత వరకూ రెమ్యునరేషన్లు తీసుకోలేదు..లెక్కలు చూసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోం శాఖ ఇప్పుడు ఎక్కువ బిజీగా ఉన్నది కొత్త సినిమాల టిక్కెట్ రేట్ల పెంపు జీవోల జారీలోనే అని అధికారులు వ్యంగాస్త్రాలు సందిస్తున్నారు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్2, ఇప్పుడు ఆచార్య సినిమాల విషయంలో అదే జరిగింది. సినిమా సినిమాకు ఇలా దరఖాస్తు చేసుకోవటం..సర్కారు ఇలా ప్రతిదానికి విడివిడిగా అనుమతులు ఇవ్వటం వెనక ఏదో మతలబు ఉందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక విధానం తెచ్చి ఈ సినిమాకు అయినా అదే వర్తిస్తుందని చెప్పటం పద్దతి కానీ..ఇలా విడి విడిగా నిర్ణయాలు..విడి విడిగా రేట్లు పెంపు అన్నది ఏ మాత్రం సరైన విధానం కాదనే విమర్శలు ఉన్నాయి.