ప్రముఖ సింగర్ సునీత తాను కరోనా బారినపడినట్లు తెలిపారు. స్వయంగా ఆమె వీడియో ద్వారా ఈ విషయం వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం తనకు కరోనా సోకిందని.. అయితే ప్రసుతం దాని నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఓ ప్రోగ్రాం షూటింగ్ సమయంలో తనకు తలనొప్పి రాగా టెస్టు చేయించుకోవడంతో.. కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.
అప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ హోం ఐసోలేషన్లో ఉండి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. మహమ్మారితో పోరాటం అంత సులువేమీ కాదని.. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని..ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సునీత.