అహ్మద్ పటేల్. కాంగ్రెస్ పాలనలో వెలుగు వెలిగిన నేత. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఆయనకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. పలు ఆరోపణలు చుట్టుముట్టాయి. అంతే కాదు..పలు లావాదేవీలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసులు కూడా వెళ్ళాయి. కానీ పలుమార్లు ఆయన రకరకాల కారణాలతో విచారణకు హాజరు కాలేదు. కోవిడ్ 19 వచ్చాక ఈ కారణాన్ని కూడా చూపించి ఆయన విచారణ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈడీ రూట్ మార్చింది.. ఆయన ఇంటికెళ్ళి విచారణ చేపట్టింది.
స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకే అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్ళారు. స్టెర్లింగ్ బయోటెక్ కంపెనీకి సంబంధించి 5,000 వేల కోట్ల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లు సందేశర సోదరులు నితిన్, చేతన్ ప్రస్తుతం పరారీలో ఉండగా, వీరు నైజీరియాలో దాక్కున్నారని, వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ఏజెన్సీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.