ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే భారత్ కీలకమైన మందుల ఎగుమతిపై ఆంక్షలను పాక్షికంగా సడలిస్తూ నిర్ణయం తీసుకోవటం దుమారం రేపుతోంది. కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమెరికాకు సరఫరా చేయకపోతే ప్రతీకార చర్యలు ఉండొచ్చని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ట్రంప్ బెదిరింపులకు లొంగి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై నిషేధాన్ని పాక్షికంగా సడలించిందని ఆరోపించింది. ‘మోదీజీ, చైనీస్ చొరబాట్లపై యూపీఏ మీ సలహాను గుర్తుంచుకుంటుంది. మీరు వారి కళల్లో చూడండి అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ కళ్లలో చూడాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన బెదిరించారు. మీరు అనుమతి ఇచ్చేశారు.
56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది?’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. ట్రంప్ బెదిరింపులను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశిథరూర్, జైవీర్ షెర్గిల్ ఖండించారు. తన రాజకీయ జీవివంతో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు దిగడం ఎప్పుడూ చూడలేదని శశిథరూర్ పేర్కొన్నారు. ప్రాణాలను రక్షించే మందులు మొదట భారతీయులకు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచాలని, తర్వాతే మిగతా దేశాలకు సరఫరా చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ కూడా తన ట్వీట్ లో ఇదేమి ఫ్రెండ్ షిప్ అని ప్రశ్నించారు. తామిద్దరం మంచి స్నేహితులం అని మోడీ, ట్రంప్ లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.