మంచి మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్

Update: 2020-03-22 16:41 GMT

కరోనా వైరస్ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. తన దగ్గర పనిచేసే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరికీ ముందస్తుగా వేతనాలు చెల్లించేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ... నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను.

కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు... నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది.’ అని పేర్కొన్నారు.

 

Similar News