ఎన్ పీఆర్ పై అమిత్ షా కీలక ప్రకటన

Update: 2020-03-12 15:58 GMT

జాతీయ పౌర పట్టిక (ఎన్ పీఆర్)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ఎన్ పీఆర్ కు ప్రజలెవరూ ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నిర్ధిష్టమైన సమాచారం ఇవ్వకూడదని ఎవరైనా అనుకుంటే వారికి ఇబ్బంది ఏమీ ఉండదని..వారిని ఎలాంటి ప్రశ్నలు అడగబోమని తెలిపారు. సమాచారం ఇవ్వాలా..వద్దా అన్నది ప్రజల ఇష్టమే అన్నారు. ఎన్ పీఆర్ పై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎవరినీ సందేహస్పదంగా గుర్తించరని తెలిపారు.

రాజ్యసభలో ఢిల్లీ అల్లర్ల అంశంపై మాట్లాడుతూ అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత కొంత మంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని షా విమర్శించారు. సీఏఏతో పౌరసత్వం పోతుందనే అపోహలు సృష్టిస్తున్నారని..ముఖ్యంగా ముస్లింలను ఈ రకంగా భయపెడుతున్నారని తెలిపారు. ఢిల్లీ అల్లర్ల వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రశ్నలేదని ప్రకటించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంభిస్తున్నట్లు తెలిపారు.

Similar News