కేంద్రంలోని బిజెపికి మరో సారి ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఢిల్లీ పీఠంపై కన్నేసిన ఆ పార్టీకి నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం రాసి పెట్టుకోండి..మేమే గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తేలాలంటే ఫిబ్రవరి 11న వెల్లడయ్యే ఫలితాల్లో తేలిపోనుంది. అయితే ముందు నుంచి సర్వేలు చెప్పిన తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఏకపక్షంగా ఆప్ వైపు మొగ్గుచూపాయి. మళ్ళీ ఆప్ దే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంతో కేజ్రీవాల్ మళ్ళీ సీఎం పీఠాన్ని అధిష్టించటం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 58 శాతం పోలింగ్ నమోదైంది. 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.
శనివారం నాడు ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత పలు జాతీయ వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేశాయి. అందులో మెజారిటీ సర్వేలు ఆప్కే జై కొట్టాయి. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి 54 నుంచి 59 సీట్లు, బీజేపీకి 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్కు 0 నుంచి 2 సీట్ల వరకు గెలుచుకుంటాయని పీపుల్స్ పల్స్ ప్రిడిక్షన్ సర్వే సంస్థ అంచానా వేసింది. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని తెలిపింది. జాతీయవాదంపై జనాకర్షణ విజయం సాధించిందని పేర్కొంది. సంక్షేమ పథకాలు ఆప్నకు అధికారాన్ని అందించనున్నాయని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి విజయ దుందుబి మోగిస్తుందని టైమ్స్ నౌ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ 44, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది.
న్యూస్ ఎక్స్ నేతా ప్రకారం.. ఆప్ 53-57, బీజేపీ 11-17, ఇతరులు0-2 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం.. ఆప్ 48-61, బీజేపీ 9-21 స్థానాల్లో గెలుపొందనున్నారు. ఇండియా టీవీ సర్వే ప్రకారం ఆప్ 44, బీజేపీ26, స్థానాల్లో విజయం సాధించనున్నారు. జన్కీ బాత్ సర్వే ప్రకారం.. ఆప్ 55, బీజేపీ 15 స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. ఇండియా న్యూస్ నేషన్ ప్రకారం. ఆప్ 55, బీజేపీ 14, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందనున్నారు. సుదర్శన్ న్యూస్ సర్వే ప్రకారం.. ఆప్ 40-45, బీజేపీ 24-28, ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధించనున్నారు.