టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సోమవారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ ఫ్యామిలీపై డైరక్ట్ ఎటాక్ చేశారు. తండ్రీ, కొడుకు, కూతురు బాగుపడితే బంగారు తెలంగాణ అయిపోయినట్లేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న డీఎస్ మౌనంగా ఉంటూ వస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల తరుణంలో ఆయన బయటకు వచ్చి అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించటం కీలకంగా మారింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పు చేశానని డీఎస్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ తనపై సోనియాగాంధీకి తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్లే మనస్తాపంతో పార్టీని వీడినట్లు తెలిపారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తలతిక్క మాటలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తనపై ప్రశాంత్రెడ్డి చేసిన విమర్శలను డీఎస్ తీవ్రంగా ఖండించారు. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను ఇప్పటికైనా పార్టీ నుంచి సస్పెండ్ చేయలన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా.. తన సస్సెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారని డీఎస్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ అభివృద్ధికి తన కంటే గొప్పగా ఎవరైనా చేశారా? అని ప్రశ్నించారు.