మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్!

Update: 2019-11-02 12:48 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించనున్నారా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. పవన్ కొత్త సినిమాను అంగీకరించారనే విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయటంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ట్వీట్ ను శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకపూర్ రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం వాస్తవమే అని తేలిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ తరపున ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటన చేసింది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చేసిన చివరి సినిమా ‘అజ్ణాతవాసి’. ఇప్పుడు హిందీలో సూపర్ హిట్‌ అయిన పింక్‌ సినిమా రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాని హీరోగా ‘ఎంసీఏ’ సినిమా తీసిన వేణు శ్రీరామ్‌కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, తాప్పీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్‌’ సినిమా 2016లో హిందీలో మంచి విజయాన్ని అందుకుంది.

పింక్ సినిమాను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేశారు. స్టార్‌ హీరో అజిత్‌ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మించారు. తమిళంలోనూ విజయం సాధించడంతో తెలుగులోనూ రీమేక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాకు ఓకే చెప్పటం ఆసక్తికరంగా మారింది. గతంలోనూ ఇదే తరహా వార్తలు వచ్చినా కూడా ఆయన స్వయంగా ప్రకటన విడుదల చేసి..పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని తెలిపారు. కానీ ఇఫ్పుడు సడన్ గా ఓ చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావటం ఆసక్తికరం. పింక్ తోపాటు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తన సమయ వెసులుబాటును బట్టి సినిమాలకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

 

Similar News