షాకింగ్....మహిళా తహసీల్దార్ సజీవదహనం

Update: 2019-11-04 10:35 GMT

దారుణం. ఓ మహిళా తహసీల్దార్ పై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. అది కూడా రాజధాని నగరం హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో ఈ ఘటన చేసుకోవటం అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడి ఘటనతో తీవ్రగాయాల పాలైన ఆమె అక్కడికి అక్కడే మరణించారు. పెద్ద ఎత్తున ఆమెపై కిరోసిన్ పోసి మంట అంటించటంతో కాలిన గాయాలతో విజయారెడ్డి తుది శ్వాస విడిచారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్‌ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని హయత్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఈ ఘటనకు భూవివాదమే కారణమై ఉంటుందని చెబుతున్నారు. తహశ్దీలార్ మృతితో ఆమె కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఓ మనిషిని చంపేంత కిరోసిన్ తో ఓ వ్యక్తి తహశీల్దార్ కార్యాలయంలోకి ఎలా వెళ్ళగలిగాడు అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది. ఈ ఘటనపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. వారు కూడా పలు చోట్ల ఆందోళనలకు దిగారు. తహసీల్దార్ పై దాడికి పాల్పడింది సురేష్ అనే వ్యక్తిగా గుర్తించారు. రిజిస్ట్రేషన్ వివాదమే ఈ హత్యకు కారణం అని ప్రాధమికంగా నిర్ధారించినట్లు సమాచారం. నిందితుడు తానే స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

 

Similar News