కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం

Update: 2019-07-29 07:52 GMT

కర్ణాటక రాజకీయాల్లో స్పీకర్ రమేష్ కుమార్ ఓ సంచలనంగా మారారు. ఆయన తన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. సోమవారం అసెంబ్లీలో యడియూరప్ప సర్కారు విశ్వాసపరీక్షలో నెగ్గాగానే ఆయన పదవికి రాజీనామా చేశారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన వెంటనే తన స్థానం నుంచి రాజీనామా లేఖను చదివి విన్పించారు. స్పీకర్‌ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్‌ కే.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్‌ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్‌ను ఎన్నుకోనుంది.

Similar News