సరిగ్గా ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరి..ఎంపీగా గెలుపొందిన నామా నాగేశ్వరరావుకు జాక్ పాట్ తగిలింది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలను కాదని..తాజాగా పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కెసీఆర్ ఏకంగా లోక్ సభలో పార్టీ నేత పదవి అప్పగించారు. గురువారం ప్రగతిభవన్లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
రాజ్యసభలో టీఆర్ఎస్ నాయకుడిగా కేశవరావు వ్యవహరించనున్నారు. అదే సమయంలో పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా కేశవరావు కొనసాగుతారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ భేటీలో చర్చించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.