కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ ఎస్ లోకి జంప్ అయినట్లేనా?. ఆయన మాటలు చూస్తుంటే ఎవరికైనా ఈ అనుమానం రాక మానదు. నిజంగా జగ్గారెడ్డికి పార్టీ మారే ఉద్దేశం లేకపోతే ఆ విషయం స్పష్టంగా చెబుతారు. కానీ ఆయన మాత్రం మే 25-30 తేదీల మధ్య తాను గాంధీ భవన్ లో ఉంటానో..లేక టీఆర్ఎస్ భవన్ లో ఉంటానో తెలియదని వ్యాఖ్యానించటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. అంతే కాదు..కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. తాను స్వశక్తిగా ఎదిగాను.. పార్టీ బ్యానర్పై గెలిచిన నేతను కానని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ చెప్పింది సగం వింటాను.
మిగతా సగం తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్లో కూడా అదిష్టానం చెప్పింది సగం వింటాను.. మిగతా సగం తన నిర్ణయాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి రెండు రాష్ట్రాలు చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో అదిష్టానానికి చెప్పాలంటే మధ్యవర్తులకు చెప్పాలి..కానీ ఆ మధ్యవర్తులు అదిష్టానానికి మనం చెప్పింది చెబుతారో లేదో చెప్పలేమని అన్నారు.